Search This Blog

Saturday, April 2, 2022

8 మంది ఐఏఎస్‌లకు ‘సేవా శిక్ష’


ధిక్కరణ కేసులో హైకోర్టు సంచలన తీర్పు





నెలలో ఒక ఆదివారం... 

ఏడాదిపాటు సంక్షేమ హాస్టళ్లకు వెళ్లాలి

అక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలి

ఒకపూట సొంత ఖర్చుతోనే భోజనం పెట్టాలి

తొలుత శిక్షగా రెండు వారాల జైలు, జరిమానా 

క్షమాపణలు చెప్పడంతో ‘సేవా శిక్ష’గా మార్పు

బడి ప్రాంగణాల్లోని సచివాలయాలు, ఆర్బీకేలను 

ఖాళీ చేయించాలన్న ఉత్తర్వులపై అలసత్వం

ఉద్దేశపూర్వకంగానే అధికారుల నిర్లక్ష్యం

సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు

జస్టిస్‌ బట్టు దేవానంద్‌ కీలక తీర్పు


‘సేవా శిక్ష’ ఎవరికి.. ఏ జిల్లాలో?

గోపాలకృష్ణ ద్వివేది - కృష్ణా జిల్లా, గిరిజా శంకర్‌ - ప్రకాశం జిల్లా, బి.రాజశేఖర్‌ - శ్రీకాకుళం, వి.చిన వీరభద్రుడు - విజయనగరం,  వై.శ్రీలక్ష్మి  - పశ్చిమ గోదావరి, జె.శ్యామలరావు - అనంతపురం, జి.విజయ్‌ కుమార్‌ - కర్నూలు జిల్లా, ఎంఎం నాయక్‌- నెల్లూరు.


అమరావతి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఎనిమిది మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు న్యాయస్థానం ‘సేవా శిక్ష’ విధించింది. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలపై నిర్లక్ష్యం ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెలలో ఒక ఆదివారం... ఏడాదిపాటు సంక్షేమ వసతి గృహాలకు వెళ్లి, అక్కడి విద్యార్థులకు సేవ చేయాలని ఆ అధికారులను ఆదేశించింది. ఆ రోజున ఒక పూట తమ సొంత ఖర్చులతో విద్యార్థులకు భోజనం అందించాలని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఖాళీ చేయించాలన్న ఆదేశాల అమలులో విఫలమైనందుకు కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంది.


హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఈ సంచలన తీర్పు వెలువరించారు. పంచాయితీరాజ్‌శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, కమిషనర్‌ గిరిజా శంకర్‌, పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌, అప్పటి కమిషనర్‌ వి.చినవీరభద్రుడు, పురపాలకశాఖ ప్రస్తుత ప్రత్యేకప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పురపాలకశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, పురపాలకశాఖ అప్పటి డైరెక్టర్‌ జి. విజయ్‌కుమార్‌, ప్రస్తుత డైరెక్టర్‌ ఎం.ఎం నాయక్‌లకు కోర్టు శిక్ష విధించింది. ఏ అధికారి ఏ జిల్లాలో సేవ చేయాలో కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని నిర్ధారిస్తూ... తొలుత వీరికి 2 వారాల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. ఆ సొమ్మును చెల్లించడంలో విఫలమైతే  మరోవారం జైలుశిక్ష అనుభవించాలని స్పష్టం చేశారు. ‘మీరు చెప్పుకోవాల్సిందేమైనా ఉందా?’ అని అధికారులను ప్రశ్నించారు. ఆపై అధికారులు ఒకరి తర్వాత ఒకరు న్యాయమూర్తి ముందుకొచ్చి... ఉత్తర్వులను సకాలంలో అమలు చేయనందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుంటామన్నారు. తమ వయస్సుతోపాటు ఇంతకాలం  అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని క్షమించాలని కోరారు.


దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ... సామాజిక సేవ చేయడానికి అంగీకరిస్తే  మానవతా దృక్పథంతో క్షమాపణను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అందుకు ఐఏఎస్‌ అధికారులు అంగీకరించారు. దీంతో... న్యాయమూర్తి తీర్పును సవరించి, జైలు శిక్షకు బదులు ‘సేవా శిక్ష’ విధించారు. ‘‘నెలలో  ఒక ఆదివారం చొప్పున ఏడాదిలో 12 ఆదివారాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సమయం కేటాయించాలి. విద్యార్థుల్లో స్ఫూర్తి రగల్చాలి. ఆ రోజున విద్యార్థులకు సొంత ఖర్చులతో మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం ఏర్పాటు చేయాలి’’ అని ఆదేశించారు. ప్రతి నెలా అధికారులు హాస్టల్‌ను సందర్శించిన ఫొటోలను హైకోర్టు రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు పంపించాలని స్పష్టం చేశారు.  కోర్టుకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైతే కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని తిరిగి తెరిచేవీలు రిజిస్ట్రీకి కల్పించారు.


ఏమిటీ కేసు...

ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో  గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు నిర్వహించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాల దాఖలయ్యాయి. వాటిని తక్షణం తొలగించాలని 2020 జూన్‌లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఆదేశాలు అమలు కాకపోవడంతో కోర్టు సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు చేసింది.


కోర్టు తీర్పును ఆ అధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని అభిప్రాయపడ్డారు. అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం... 1371 పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు స్పష్టమౌతుందని న్యాయమూర్తి అన్నారు. ‘‘సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసేంతవరకు వాటి తొలగింపునకు అధికారులు  చర్యలు తీసుకోలేదు. 2021 సెప్టెంబరులో మాత్రమే పాఠశాలల ప్రాంగణాల నుంచి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఖాళీ చేయించారు.. కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసేంతవరకు అధికారులు చర్యలు తీసుకోలేదంటే... పేదల పట్ల అధికారుల వైఖరి ఎలా ఉందో అర్థమవుతోంది. చట్టప్రకారం విధులు నిర్వహించడం అధికారుల బాధ్యత’’ అని తెలిపారు. సీనియర్‌ అధికారుల నుంచి ఇలాంటి అలసత్వం, చట్టంపట్ల వారికి ఉన్న అమర్యాదను ఊహించలేదని వ్యాఖ్యానించారు. ఇది పూర్తిగా దురదృష్టకరం, విచారకరమని అన్నారు.


ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను తొలగించాలని 2020 జూన్‌లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ... కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసేదాకా అధికారులు స్పందించలేదు. 2021 సెప్టెంబర్‌లో పాఠశాలల ప్రాంగణాల నుంచి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఖాళీ చేయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది పేద, మధ్యతరగతి పిల్లలే. ధిక్కరణ కేసు నమోదు చేసేదాకా అధికారులు పట్టించుకోలేదంటే... పేద పిల్లల పట్ల అధికారుల వైఖరి ఎలా ఉందో అర్థమవుతోంది!

హైకోర్టు




TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top