అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో ఏపీలో 8 మంది ఐఏఎస్లకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. అధికారులకు రెండు వారాల పాటు శిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఐఏఎస్ అధికారుల్లో విజయ్ కుమార్, శ్యామలరావు, జి.కె.ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చినవీరభద్రుడు, ఎం.ఎం.నాయక్లు ఉన్నారు. దీంతో ఎనిమిది మంది అధికారులు హైకోర్టును క్షమాపణలు కోరారు. స్పందించిన ఉన్నత న్యాయస్థానం జైలు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలకు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒక రోజు వెళ్లి సేవ చేయాలని స్పష్టం చేసింది. ఏడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమం చేపట్టాలని తెలిపింది. విద్యార్థుల మధ్యాహ్నం, రాత్రి భోజన ఖర్చులు.. ఒక రోజు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాల తొలగింపునకు గతంలో హైకోర్టు ఆదేశించింది. ఉత్తర్వులు పట్టించుకోకపోవడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2020లో ఇచ్చిన ఆదేశాలు ఏడాది పాటు పట్టించుకోలేదని మండిపడింది. ఈ క్రమంలో అధికారుల వైఖరిని హైకోర్టు కోర్టు ధిక్కరణగా భావించింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వుల అమలు నిర్లక్ష్యం చేశారని ఆగ్రహించింది.